: దావూద్ ఇబ్రహీం పేరుతో జనాలతో నినాదాలు చేయించిన హఫీజ్ సయాద్ కొడుకు

కరుడుగట్టిన ఉగ్రవాద సంస్థ జమాత్ ఉద్ దవాకు ఇండియా మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ దావూద్ ఇబ్రహీంతో ఉన్న అక్రమ సంబంధం బట్టబయలయింది. ప్రస్తుతం ఈ సంస్థ అధినేత హఫీజ్ సయీద్ ను పాక్ ప్రభుత్వం గృహ నిర్బంధంలో ఉంచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం ఆ సంస్థకు ఆయన కుమారుడు తల్హా సారథ్యం వహిస్తున్నట్టు తెలుస్తోంది. తాజాగా తల్హాకు చెందిన ఓ వీడియో సంచలనంగా మారింది.

ఫిబ్రవరి 5న పాకిస్థాన్ లో నిర్వహించిన 'కశ్మీర్ డే' సందర్భంగా ఓ సభను తల్హా నిర్వహించాడు. ఈ సందర్భంగా సభకు హాజరైన జనాలను ఉద్దేశించి తల్హా మాట్లాడుతూ, మీరంతా పోలీసులు, డాక్టర్లు, న్యాయమూర్తులు అవుతారా? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా జనాలంతా 'లేదు' అంటూ సమాధానమిచ్చారు. ఆ తర్వాత మీరంతా దావూద్ లా అవుదామనుకుంటున్నారా? అని అడగ్గా... జనాలు 'అవును' అంటూ దావూద్ పేరుతో నినాదాలు చేశారు. అంతేకాదు, కశ్మీర్ ఎన్ కౌంటర్ లో మరణించిన బుర్హాన్ వనీ పేరును కూడా ఉపయోగిస్తూ... ఆయనలా మారుతామంటూ జనాలతో నినాదాలు చేయించాడు.

ఈ వీడియోపై భారత నిఘా వర్గాలు దృష్టి సారించాయి. జమాత్ ఉద్ దవాతో కలసి దావూద్ కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నాయి.

More Telugu News