: ఫ్రెంచ్ ఫ్రైస్ అడిగితే, ఫ్రై చేసిన బల్లిని సర్వ్ చేసిన మెక్ డొనాల్డ్స్!

తనకు ఇష్టమైన ఫ్రెంచ్ ఫ్రైస్ తినడానికి మెక్ డొనాల్డ్స్ కు తన కుమార్తెతో కలసి వెళ్లిన ప్రియాంకా మోయిత్రా అనే యువతికి చేదు అనుభవం ఎదురైంది. నోరూరించే ఫ్రెంచ్ ఫ్రైస్ మధ్యలో ఓ బల్లి ఫ్రై కూడా ఆమెకు వచ్చింది. కోల్ కతాలోని ఈఎం బైపాస్ ప్రాంతంలోని మెక్ డొనాల్డ్స్ ఔట్ లెట్లో జరిగిన ఈ ఘటనపై ప్రియాంక ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. తమకు సర్వ్ చేసిన ప్లేట్ లో ఫ్రై చేయబడిన బల్లి కూడా వచ్చిందని ఆమె తెలిపింది.

"నా నాలుగేళ్ల కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా మెక్ డొనాల్డ్స్ కు వెళ్లాము. బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఆర్డర్ చేశాము. తింటుండగా ఫ్రెంచ్ ఫ్రైస్ మధ్యలో బల్లి కనిపించింది. దాన్ని చూడగానే నేను వాంతి చేసుకున్నాను. వెంటనే ఔట్ లెట్ మేనేజరుకు ఫిర్యాదు చేశాను. అతను క్షమాపణలు చెప్పాడు" అని వివరించింది.

జరిగిన ఘటనను ఫోటో తీసి, ఆపై ఫుల్ బాగన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశానని, మెక్ డొనాల్డ్స్ నిర్లక్ష్యంపై వారు కేసు నమోదు చేశారని తెలిపారు. ఈ విషయంలో సంస్థ ఉత్తర భారత ప్రతినిధి స్పందిస్తూ, ఈ ఘటనను తాము కూడా తీవ్రంగానే పరిగణిస్తున్నామని, సదరు కస్టమర్ తో మాట్లాడుతున్నామని, బల్లి రావడంపై అంతర్గత విచారణ జరుగుతోందని వెల్లడించారు.

More Telugu News