: నరేంద్ర మోదీ, రాహుల్ గాంధీ మధ్య 'కొబ్బరి రసం' వివాదం!

ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీల మధ్య ఇప్పుడు 'కొబ్బరి రసం' వివాదం నడుస్తోంది. కొబ్బరికాయ నుంచి నీరు మాత్రమే వస్తుందని, జ్యూస్ తీయరన్న కనీస జ్ఞానం రాహుల్ గాంధీకి లేదని గత రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించిన తరువాత కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. మోదీ అబద్ధాల రసాన్ని బాగానే తీస్తున్నారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రంజిత్ సుర్జేవాలా విమర్శించారు. మోదీ కనీస బాధ్యత కూడా లేకుండా ప్రవర్తించారని, ఆయన తప్పుడు ఫలరసాల కేంద్రం ఎక్కువ కాలం నిలవబోదని ఎద్దేవా చేశారు. తమ నేత 'నారియల్ జ్యూస్' (కొబ్బరి రసం) అనలేదని, 'నారంగీ జ్యూస్' (నారింజ రసం) అన్నారని చెబుతూ, రెండు రోజుల నాటి రాహుల్ ప్రసంగం వీడియోను ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఉంచారు. మోదీకి నారింజకూ, కొబ్బరికీ తేడా తెలీకపోవడం భారత ప్రజల దురదృష్టమని అన్నారు.

కాగా, ఈ వారం ప్రారంభంలో మణిపూర్ ఎన్నికల సభలో పాల్గొన్న రాహుల్, తన ప్రసంగంలో ఆరంజ్ జ్యూస్, పైనాపిల్ జ్యూస్ లను ప్రస్తావించిన సంగతి తెలిసిందే. రాహుల్ కొబ్బరి జ్యూస్ అన్నాడని చెబుతూ, కొబ్బరికాయ నీటిని తప్ప రసాన్ని ఇవ్వదన్న సంగతి ఆయనకు తెలియదని నిన్న మహరాజ్ గంజ్ లో జరిగిన సభలో ప్రధాని విమర్శించారు.

More Telugu News