: ఓడిపోయాం... మీ దేశాలకు వెళ్లిపొండి... లేదా చచ్చిపోండి: ఐఎస్ఐఎస్ చీఫ్ అబూ బకర్

ఇస్లామిక్ స్టేట్ చీఫ్ అబూ బకర్ అల్ బాగ్దాదీ నోటి వెంట సంచలన వ్యాఖ్యలు వచ్చాయి. ఇరాక్ లో ఐఎస్ఐఎస్ ఓడిపోయిందని ఆయన అంగీకరించాడు. అరబ్బులు కాని పోరాట యోధులంతా తమ తమ దేశాలకు వెళ్లిపోవాలని కోరాడు. అలా చేయడం ఇష్టం లేకుంటే ఆత్మాహుతి దాడి చేసి తమను తాము పేల్చుకోవాలని తాజా వీడియో ప్రసంగంలో చెప్పినట్టు ఇంటర్నేషనల్ మీడియా వెల్లడించింది.

'వీడ్కోలు ప్రసంగం' పేరిట ఈ ప్రకటన విడుదల కాగా, మోసుల్ నగరాన్ని ఇరాక్ సైన్యం పూర్తిగా ఆక్రమించడంతో ఉగ్రవాదులకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. ఈ వీడియో సందేశంలో ఐఎస్ఐఎస్ స్టేట్ కార్యాలయాన్ని మూసేయాలని ఆయన తెలిపారు. ఆత్మాహుతి దాడి చేసుకున్నవారు స్వర్గానికి వెళతారని, అక్కడ వారి కోసం 72 మంది యువతులు ఎదురు చూస్తుంటారని కూడా చెప్పాడు. కాగా, అల్ బగ్దాదీని పట్టుకుంటే రూ. 66 కోట్ల నగదు బహుమతిని పలు దేశాలు ప్రకటించిన సంగతి తెలిసిందే. 2014 ఆరంభంలో తూర్పు సిరియా, ఉత్తర ఇరాక్ పరిధిలోని చాలా ప్రాంతాలను ఉగ్రవాదులు ఆక్రమించగా, ఆ తరువాత ఇరాక్ సైన్యం ఒక్కో ప్రాంతాన్నీ తిరిగి తన అధీనంలోకి తెచ్చుకుంది.

More Telugu News