: జగన్ అంశాన్ని సీరియస్ గా తీసుకున్నాం: ఐఏఎస్ అధికారుల సంఘం

జిల్లా కలెక్టర్ బాబుపై వైసీపీ అధినేత జగన్ అనుచితంగా వ్యవహరించిన నేపథ్యంలో, ఏపీ రాజధాని అమరావతిలో ఐఏఎస్ అధికారులు సమావేశమయ్యారు. సంఘం అధ్యక్షుడు ఫరీదా ఆధ్వర్యంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా, జగన్ వ్యాఖ్యలపై ఐఏఎస్ అధికారుల సంఘం మండిపడింది. జిల్లా కలెక్టర్ పై జగన్ చేయి వేసి మాట్లాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సమావేశానికి ఐఏఎస్ అధికారులు లింగరాజు పాణిగ్రాహి, మన్మోహన్ సింగ్, జేసీ శర్మ, ఎల్వీ సుబ్రహ్మణ్యం, అజయ్ జైన్, కలెక్టర్ బాబు, జేసీ గంధం చంద్రుడు తదితరులు హాజరయ్యారు

అధికారులను జగన్ బెదిరించడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా ఫరీదా అన్నారు. నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఘటనను చాలా సీరియస్ గా తీసుకున్నామని చెప్పారు. ఓ ఐఏఎస్ అధికారిని పట్టుకుని జైలుకు పంపుతానని జగన్ ఎలా కామెంట్ చేస్తారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యవస్థలో అధికారులు కీలకభాగమనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు పరస్పరం గౌరవించుకోవాలని చెప్పారు. జగన్ పై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతామని తెలిపారు.

More Telugu News