: ఆ విషయంలో మహేష్ ను దెప్పిపొడుస్తుంటా!: నమ్రత

ఒకప్పటి మిస్ ఇండియా, తెలుగు సహా ఐదు భాషల్లో నటించిన నటి నమ్రత శిరోద్కర్. కెరీర్ తో ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... వాటన్నింటినీ వదులుకొని మహేష్ బాబు భార్యగా, తెలుగింటి కోడలుగా ముంబై నుంచి హైదరాబాద్ వచ్చింది నమ్రత. వీరి వివాహం జరిగి 12 ఏళ్లు పూర్తయింది. ఇద్దరు పిల్లలు. గృహిణిగా ఇంటిపనులన్నీ చక్కబెడుతూనే, మహేష్ వ్యవహారాలన్నింటినీ ఆమె చూసుకుంటున్నారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తన భర్త, పిల్లల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది.

సినిమాలతో మహేష్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ... కొంచెం తీరిక దొరికినా పిల్లలు గౌతమ్, సితారలతో గడుపుతాడని నమ్రత తెలిపింది. పిల్లలను అతి గారాబం చేస్తాడని... వాళ్లు ఏది అడిగినా కొనిపెట్టేది మహేషే అని చెప్పింది. ఈ విషయంలో కొన్నిసార్లు మహేష్ పై తాను కోప్పడుతుంటానని... నీ వల్లే పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారని... వాళ్లను నీవు పాడుచేస్తున్నావంటూ దెప్పిపొడుస్తుంటానని తెలిపింది. తన ఉద్దేశం ప్రకారం తల్లిదండ్రుల్లో ఒకరు గారాబం చేస్తే, మరొకరు క్రమశిక్షణను పిల్లలకు అలవాటు చేయాలని అభిప్రాయపడింది. మహేష్ వారికి అల్లరి నేర్పుతుంటే... తాను క్రమశిక్షణలో పెడుతూ బ్యాలెన్స్ చేస్తుంటానని తెలిపింది.

చదువు విషయంలో పిల్లలపై ఒత్తిడి పెంచడం కరెక్ట్ కాదనేది తన అభిప్రాయమని నమ్రత తెలిపింది. వారిలో జ్ఞానాన్ని పెంపొందించాలని... మంచి పౌరులుగా తయారయ్యేలా చూడాలని చెప్పింది. మార్కులు, ర్యాంకులు అంటూ వారిని ఒత్తిడికి గురి చేయడం మంచిది కాదని తెలిపింది. వారిని ఓవరాల్ గా డెవలప్ చేస్తే... జీవితంలో వారే మంచి స్థాయికి చేరుకుంటారని చెప్పింది.

More Telugu News