: శ్రీనివాస్ కూచిభొట్ల భార్యకు సాయం అందిస్తాం: అమెరికా కంపెనీ

అమెరికాలో తెలుగు ఇంజినీర్ శ్రీనివాస్ కూచిభొట్ల హత్యకు గురైన విష‌యం తెలిసిందే. శ్రీనివాస్‌ పనిచేసే గార్మిన్ సంస్థ ఆయ‌న భార్య సున‌య‌న‌కు సాయం అందించేందుకు ముందుకొచ్చింది. హైద‌రాబాద్ నుంచి శ్రీనివాస్‌ హెచ్1బి వీసాతో అమెరికాకు వెళ్లారు. ఆయ‌న వ‌ద్ద‌కు వెళ్లేందుకు సున‌య‌న హెచ్4 వీసా తీసుకొని వెళ్లారు. అయితే ఇప్పుడు ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవ‌డంతో ఆ వీసా తీసుకుని ఉంటున్న సునయన తిరిగి అమెరికా వెళ్లేందుకు వీలుండదు. దీంతో సున‌య‌న రెండు రోజుల క్రితం  తాను మళ్లీ అమెరికా వచ్చేందుకు సాయ‌ప‌డాల‌ని గార్మిన్ కంపెనీని కోరారు.

అమెరికాలో శ్రీనివాస్ కలలను నెరవేర్చేందుకు తాను ఎంచుకున్న రంగంలో విజయవంతం అయ్యేందుకు సాయపడాలని కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన స‌ద‌రు కంపెనీ ఆమె అమెరికా వచ్చేందుకు వీలుగా తగిన వీసా సిద్ధం చేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోంది. స‌ద‌రు కంపెనీకి చెందిన‌ ఇమ్మిగ్రేషన్ అధికారులతో పాటు ఆమెకు ఉచితంగా న్యాయసహాయం అందించేందుకు బ్రయాన్ కేవ్ అనే న్యాయసంస్థ సహా పలు సంస్థలు ముందుకు వచ్చాయి. శ్రీనివాస్ భార్య‌కు అన్ని రకాలుగా సాయం చేస్తామని ఆ కంపెనీ పేర్కొంది. ఆమె త‌మ దేశంలోనే ఉండి పని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని గార్మిన్ సంస్థ పేర్కొంది.

More Telugu News