: అత్యంత బాధాకరం... బెదిరింపులకు భయపడి ఢిల్లీని వీడిన గుర్ మెహర్ కౌర్!

సోషల్ మీడియాలో తనకు వస్తున్న బెదిరింపులకు భయపడి కార్గిల్ అమర వీరుడి కుమార్తె, ఢిల్లీ విద్యార్థిని గుర్ మెహర్ కౌర్ ఢిల్లీని వీడారు. ఈ విషయాన్ని ఆమెతో మాట్లాడిన అనంతరం 'వాయిస్ ఆఫ్ రామ్' పేరిట ట్విట్టర్ ఖాతాను నిర్వహిస్తున్న రామ్ సుబ్రమణియన్ స్పష్టం చేశారు. తాను మెహర్ తో మాట్లాడానని, ఆమె నిజంగా ఎంతో భయపడిందని, ఆమె ఢిల్లీని వీడిందని తెలిపారు. ఈ మేరకు ఓ ట్వీట్ చేస్తూ, ఈ దేశానికి చెందినవారిగా ఉండటం బాధాకరమని వ్యాఖ్యానించారు.

అంతకుముందు గుర్ మెహర్ కౌర్, తన ట్విట్టర్ లో పలు వ్యాఖ్యలు చేస్తూ, తనకు ఎదురైన బెదిరింపులను ప్రస్తావించారు. అత్యాచారం చేస్తామని అన్న వ్యక్తి, ఎలా చేస్తారో వివరించి ట్వీట్ పెడితే, భయంతో వణికిపోయానని చెప్పారు. నేటి ర్యాలీలో పాల్గొనడం లేదని అన్నారు. తనను ఒంటరిగా వదిలివేయాలని వేడుకున్నారు. తన నిర్ణయంపై ప్రశ్నలు సంధించాలంటే రామ్ సుబ్రమణియన్ ను అడగాలని చెప్పారు. బీజేపీ అనుబంధ విద్యార్థి విభాగం ఏబీవీపీకి వ్యతిరేకంగా గళమెత్తిన ఆమెపై సెలబ్రిటీల నుంచి క్రీడా ప్రముఖులు, సాధారణ పౌరుల వరకూ ట్వీట్లతో విమర్శల వర్షాన్ని కురిపించగా, పలువురు బెదిరింపులకు పాల్పడిన సంగతి తెలిసిందే.




More Telugu News