: జయలలితపై ఇంట్లోనే దాడి.. పొన్నయన్ సంచలన వ్యాఖ్యలు!

తమిళనాడు మాజీ మంత్రి, పన్నీర్ వర్గానికి చెందిన అన్నాడీఎంకే నేత పొన్నయన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి జయలలితను శశికళ కొట్టడం వల్లే ఆమె తీవ్ర అనారోగ్యానికి గురయ్యారని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఇంటివద్ద ఆదివారం ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ఆస్పత్రిలో జయలలిత రెండు నెలలకుపైగా చికిత్స తీసుకున్నప్పటికీ ఆమెను చూసేందుకు మాత్రం ఎవరినీ అనుమతించలేదన్నారు. చివరికి అప్పటి ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వాన్ని కూడా ఆస్పత్రిలో అడుగుపెట్టనీయలేదని గుర్తు చేశారు.

పేషెంట్ కి ఇన్ఫెక్షన్ వస్తుందన్న పేరుతో కీలక నేతలెవరనీ ఆస్పత్రిలో అడుగుపట్టనీయలేదని పేర్కొన్న పొన్నయన్.. శశికళ మాత్రం జయ గదిలో ఎందుకున్నారని ప్రశ్నించారు. జయ ఆస్పత్రిలో చేరడానికి ముందే ఇంట్లో ఆమెపై దాడి జరిగిందని ఆరోపించారు. ఈ కారణంగానే ఆమె ప్రాణాపాయస్థితిలో ఆస్పత్రిలో చేరారన్నారు. అపోలో వైద్యులు కూడా జయ విషయంలో రహస్యాలు పాటించడాన్ని చూస్తే శశికళకు, వారికి మధ్య రహస్య ఒప్పందం ఏదో జరిగిందని అనిపిస్తోందని ఆరోపించారు. జయలలిత మృతిపై న్యాయ విచారణ కోసం కమిషన్‌ను నియమించాలని పొన్నయన్ డిమాండ్ చేశారు.

More Telugu News