: పూణే టెస్టులో టీమిండియాకు ఘోరపరాభవం... 333 పరుగులతో ఆస్ట్రేలియా విజయం

పూణే వేదికగా భార‌త్‌, ఆస్ట్రేలియా జ‌ట్ల మ‌ధ్య‌ జరిగిన తొలిటెస్టు మ్యాచులో టీమిండియా ఊహించ‌ని రీతిలో ఘోర ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకుంది. ఆస్ట్రేలియా జట్టు టీమిండియా ముందు 440 పరుగుల లక్ష్యాన్ని ఉంచిన విష‌యం తెలిసిందే. ల‌క్ష్య ఛేద‌న‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా ఆది నుంచే త‌డ‌బ‌డుతూ వ‌చ్చి రెండో ఇన్నింగ్స్‌లో కేవ‌లం 107 ప‌రుగుల‌కే ఆలౌట‌యింది. దీంతో ఆస్ట్రేలియా 333 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం న‌మోదు చేసుకుంది. మొద‌టి ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా 105 ప‌రుగులు మాత్ర‌మే చేసిన విష‌యం తెలిసిందే.

దీంతో సొంత గడ్డపై వరుస విజయాలతో దూసుకుపోతోన్న విరాట్ సేనకు ఆసిస్ బ్రేక్ వేసింది. నాలుగు టెస్టుల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యత కనపరిచింది. టీమిండియా బ్యాట్స్ మెన్ లో ఓపెన‌ర్ ముర‌ళీ విజ‌య్ కేవ‌లం 2 ప‌రుగుల‌కే వెనుదిరగ‌గా, అనంత‌రం మ‌రో ఓపెన‌ర్ రాహుల్ కూడా 10 ప‌రుగుల‌కే ఔట‌య్యాడు. త‌దుప‌రి క్రీజులోకి వ‌చ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ 13 ప‌రుగు‌లు చేసి వెనుదిరిగాడు. అనంతరం వరుసగా ర‌హానే 18, పుజారా 31, అశ్విన్ 8, సాహా 5, జడేజా 3, యాదవ్ 5, ఇషాంత్ 0, ఉమేష్ యాదవ్ 0 పరుగులకే ఔట‌య్యారు. ఆస్ట్రేలియా బౌల‌ర్ల‌లో ఓకీఫ్ 6, లియాన్ 4 వికెట్లు తీశారు.

More Telugu News