: ఇప్పటివరకు మాకు ఛాన్స్ ఇవ్వలేదు.. కొత్త అసెంబ్లీలోనైనా మాట్లాడే అవకాశం ఇవ్వండి: ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ నవ్య రాజధాని అమరావతిలోని వెలగపూడిలో మార్చి 6వ తేదీ నుంచి అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం కానున్నాయి. మార్చి 13న రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్నారు. కొత్త అసెంబ్లీలో స‌మావేశాలు ప్రారంభం కానున్న నేప‌థ్యంలో త‌మ‌కు క‌నీసం కొత్త అసెంబ్లీలోనైనా మాట్లాడే అవ‌కాశం క‌ల్పించాల‌ని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. మూడేళ్ల చంద్ర‌బాబు పాలనలో విపక్షానికి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం దారుణమని ఆయ‌న వ్యాఖ్యానించారు. తాము ప్రస్తావించిన ఏ అంశం పైనా సభలో అధికార పక్షం స‌రైన స‌మాధానం చెప్ప‌లేద‌ని ఆయ‌న అన్నారు. 'మేం చెప్పిందే వినండి' అనేలా అధికారపక్షం ప్రవర్స్తోందని ఆయ‌న మండిప‌డ్డారు.

ఈ కొత్త అసెంబ్లీలోనైనా సంప్రదాయాన్ని పాటించాలని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎన్నో స‌మ‌స్య‌లు ఉన్నాయ‌ని, తాగునీటి, నిరుద్యోగ, మహిళా స‌మ‌స్య‌ల‌తో పాటు ప్రభుత్వ ఉద్యోగులపై దాడులు లాంటివి జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. వాటితో పాటు పార్టీ ఫిరాయింపుల అంశం, స్విస్ ఛాలెంజ్ విధానం, రాజధాని కోసం చేపట్టిన భూ సేకరణ అంశాల‌పై తాము ప్ర‌శ్నించాల్సి ఉంద‌ని చెప్పారు.

More Telugu News