: అమెరికాలో ఉండడం సబబేనా? అనిపిస్తోంది: కూచిభొట్ల శ్రీనివాస్ భార్య ఆవేదన

అమెరికా మాజీ నేవీ సైనికుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త మరణంపై ఏర్పాటు చేసిన సంతాప సభలో ఆమె మాట్లాడుతూ, తన భర్త ఇంత దారుణమైన మృతికి అర్హుడు కాదని పేర్కొంది. మంచి వాళ్లకు మంచే జరుగుతుందని తన భర్త ఎప్పుడూ చెప్పేవాడని తెలిపింది. తన భర్తను అత్యంత పాశవికంగా హత్య చేసిన వ్యక్తి నానా దుర్భాషలాడాడని తెలిపింది. తన భర్త హత్య విషయంలో తనకు అమెరికా ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఆమె డిమాండ్ చేసింది. అమెరికాలో అమెరికా కోసం సేవ చేస్తున్న వారికి రక్షణ ఉందా? అని ఆమె ప్రశ్నించారు. అమెరికాలో ఏం జరుగుతోందని ఆమె నిలదీశారు. అప్పుడప్పుడు వార్తల్లో ఇలాంటి వార్తలు చూసి, షాక్ కు గురయ్యేవారమని ఆమె తెలిపింది.

అప్పుడప్పుడు తన భర్తతో ఎందుకీ జీవితం.. మనదేశం వెళ్లిపోదామని అనేదానినని సునయన తెలిపింది. అయితే తన భర్త మాత్రం మనం మంచి చేస్తే మంచే జరుగుతుంది, చెడు చేస్తే చెడు జరుగుతుంది, దేనికీ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పావారని గుర్తుచేసుకుని కన్నీటిపర్యంతమైంది. తమకు పిల్లలు కూడా లేరని, ఇప్పుడు తాను సగం కుటుంబంతో ఒంటరిగా కేవలం ఆయన జ్ఞాపకాలతో మిగిలిపోయానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అక్కడకి వచ్చినవారంతా విషణ్ణవదనులయ్యారు. ఆమెకు మద్దతుగా శ్వేతజాతీయులు కూడా నిలవడం విశేషం. 

More Telugu News