: కోహ్లీ డకౌట్.. పుజారా ఔట్.. కుప్పకూలిన టాప్ ఆర్డర్

పూణే టెస్టు తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా టాప్ ఆర్డర్ కుప్పకూలింది. కేవలం 44 పరుగులకు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ మురళీ విజయ్ 10 పరుగులు చేసి ఔట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన ఛటేశ్వర్ పుజారా కేవలం 6 పరుగులు మాత్రమే చేసి ఔట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్ లో కీపర్ వేడ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ కోహ్లీ... అభిమానులను తీవ్రంగా నిరాశపరిచాడు. కేవలం రెండు బంతులను మాత్రమే ఎదుర్కొన్న కోహ్లీ డకౌట్ అయ్యాడు. స్టార్క్ బౌలింగ్ లో స్మిత్ కు క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. స్టార్క్ వేసిన బంతి కోహ్లీ బ్యాట్ అంచును తాకి ఫస్ట్ స్లిప్ లోకి వెళ్లింది. ఎలాంటి పొరపాటు చేయకుండా స్మిత్ ఆ క్యాచ్ ను అందుకున్నాడు. కోహ్లీ ఔట్ కావడంతో స్టేడియంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఆ తర్వాత రహానే క్రీజులోకి వచ్చాడు. ప్రస్తుతం టీమిండియా స్కోరు మూడు వికెట్ల నష్టానికి 45 పరుగులు. లోకేష్ రాహుల్ 29 పరుగులతో ఆడుతున్నాడు.

More Telugu News