: కిమ్ జోంగ్ నామ్ శరీరంలోకి అత్యంత విషపూరిత కెమికల్ ను పంపారు.. విచారణలో తేలిన వాస్తవం!

ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ సోదరుడు కిమ్ జోంగ్ నామ్ శరీరంలోకి అత్యంత విషపూరితమైన కెమికల్ ను పంపి, ఆయనను హత్య చేశారని విచారణలో తేలింది. ఆయన కళ్లు, ముఖంలోని కొన్ని భాగాల నుంచి సేకరించిన శాంపిల్స్ ను పరీక్షించి చూడగా, వాటిలో వీఎక్స్ నెర్వ్ ఏజెంట్ కు చెందిన ఆనవాళ్లు కనిపించాయని మలేషియా పోలీసులు ఈ రోజు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఈ విషాన్ని వీఎక్స్ నెర్వ్ ఏజెంట్ లేదా, ఎస్-2 డైసోప్రొపైలమైనో ఈథైల్ మీథైల్ ఫాస్ఫోనోథియోలైట్ అని కూడా పిలుస్తారని తెలిపారు. ఈ కెమికల్ ను ఎవరైనా తాకితే 15 నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

మకావు వెళ్లేందుకు కిమ్ జోంగ్ నామ్ కౌలాలంపూర్ ఎయిర్ పోర్టుకు వచ్చినప్పుడు ఇద్దరు మహిళలు ఆయనపై దాడి చేసి హత్య చేశారు. ఈ ఇద్దరు మహిళలు ఉత్తర కొరియా ఏజెంట్లేనని అమెరికా, దక్షిణ కొరియా అధికారులు ఆరోపించారు. విమానాశ్రయంలో లభించిన సీసీటీవీ ఫుటేజ్ ప్రకారం ఈ ఇద్దరు మహిళలు ఆయన ముఖంపై విషాన్ని స్ప్రే చేసి, అక్కడ నుంచి హడావుడిగా వెళ్లిపోయారు.

More Telugu News