: పోలీసుల వేధింపులను ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ప్రపంచానికి చూపించిన ప్రేమజంట

తిరువనంతపురంలోని మ్యూజియం పార్కులో ఓ ప్రేమ‌జంట కూర్చుని ఉండగా, వారివ‌ద్ద‌కు ఇద్ద‌రు పోలీసులు వ‌చ్చారు. స‌ద‌రు అమ్మాయి, అబ్బాయి పార్కులో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంటూ పోలీసులు వాళ్లను ప్రశ్నించడం మొదలుపెట్టి ఎంత‌కూ వ‌ద‌ల‌లేదు. ప్రేమికులు ఎంత‌గా ఇబ్బంది పడినా పోలీసులు త‌మ‌ వేధింపులను కొన‌సాగించారు. ఇంత‌లో ప్రేమికుల‌కి ఓ ఐడియా వ‌చ్చింది. పోలీసులు త‌మ‌ను వేధిస్తోన్న తీరును ఫేస్‌బుక్‌ ద్వారా లైవ్‌లో చూపించారు. దీంతో పార్కులో పోలీసులు ప్ర‌వ‌ర్తిస్తోన్న తీరు ప్ర‌పంచానికి తెలిసింది.

తాము పార్కులో కేవలం కూర్చుని మాట్లాడుకుంటున్నామని స‌ద‌రు ప్రేమజంటలోని యువకుడు చెప్పాడు. ఆ స‌మ‌యంలో తాను త‌న ప్రియురాలి భుజం మీద చేయి వేసుకుని కూర్చున్నానని, అందులో అసభ్యత ఏముంటుంద‌ని చెప్పాడు. పోలీసులు తమతో ప్ర‌వ‌ర్తించిన తీరు ప‌ట్ల ఆందోళ‌న చెందిన యువతి తాము కోర్టును ఆశ్రయిస్తామని తెలిపింది. త‌మ‌ను వేధించిన‌ ఇద్దరు పోలీసులలో ఒక మహిళా పోలీసు కూడా ఉన్నారని చెప్పింది. కాగా, స‌ద‌రు ప్రేమికులు పార్కులో అసభ్యంగా ప్రవర్తించార‌ని వారిని అరెస్టు చేసి, ఐపీసీ సెక్షన్ 290 కింద కేసు నమోదు చేశామ‌ని  పోలీసులు పేర్కొన్నారు.  

More Telugu News