: ఆయుధాల‌ దిగుమ‌తిలో భారత్ దే అగ్రస్థానమట!

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా ఆయుధాల‌ను దిగుమ‌తి చేసుకుంటున్న దేశాల్లో భార‌త్ అగ్ర‌స్థానంలో ఉంద‌ని స్టాక్‌హోమ్ ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నివేదిక పేర్కొంది. 2012 నుంచి 2016 మ‌ధ్య మొత్తం ఆయుధాల దిగుమ‌తిలో భార‌త్ వాటా 13 శాతంగా ఉందని తెలిపింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కూడా ఆయుధాల దిగుమ‌తి గ‌ణ‌నీయంగా పెరిగిపోయింద‌ని పేర్కొంది. ఆయుధాల దిగుమ‌తిలో మ‌న దేశం త‌ర్వాతి స్థానాల్లో సౌదీ అరేబియా, యూఏఈ, చైనా, అల్జీరియా ఉన్నాయి. అంత‌కు ముందు వెల్ల‌డించిన నివేదిక‌లో కూడా మ‌న‌దేశమే తొలిస్థానంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. 2007, 2011 మ‌ధ్య 9.7 శాతం వాటాతో భారత్ అగ్ర‌స్థానంలో నిలిచింది.

భార‌త్ తరువాత‌ అర‌బ్ దేశాలు ఎక్కువ‌గా ఆయుధాల‌ను దిగుమ‌తి చేసుకుంటున్నాయ‌ని, యెమెన్‌, సిరియాల‌తో ఉన్న ఉద్రిక్త ప‌రిస్థితులు, అంతర్యుద్ధాల కార‌ణంగానే ఆ దేశాలు అత్య‌ధికంగా ఆయుధాల‌ను దిగుమ‌తి చేసుకుంటున్నాయ‌ని పేర్కొంది. భార‌త్‌కి పొరుగుదేశాలైన చైనా, పాకిస్థాన్‌ల నుంచి ముప్పు ఉండ‌డంతో ఆయుధాల‌ను అధికంగా దిగుమ‌తి చేసుకుంటోంది. మేకిన్ ఇండియాలో భాగంగా భార‌త్‌లోనే ఆయుధాల ఉత్ప‌త్తి పెరుగుతున్నప్ప‌టికీ, అది అవ‌స‌రాల‌కు స‌రిప‌డిన విధంగా లేదని నివేదికలో పేర్కొన్నారు. భార‌త్‌లో పాత‌బ‌డిపోయిన ఫైట‌ర్ జెట్స్‌, గ‌న్స్‌, స‌బ్‌మెరైన్స్‌ను ఆధునికీక‌రించేందుకు ప్రధాని మోదీ స‌ర్కారు 25 వేల కోట్ల డాల‌ర్లు వెచ్చించాల‌ని నిర్ణ‌యం తీసుకున్న విష‌యం తెలిసిందే. ఇక‌ చైనా దేశీయంగానే ఆయుధాల‌ ఉత్ప‌త్తిని పెంచ‌డంతో గ‌తంతో పోలిస్తే ఆ దేశ‌ ఆయుధాల దిగుమ‌తి ప్ర‌స్తుతం ఒక శాతం త‌గ్గిపోయింది.

More Telugu News