: రాహుల్ సభలో ఆసక్తికర సన్నివేశం!

ఉత్తరప్రదేశ్ ఎన్నికల నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ క్షణం తీరిక లేకుండా ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో రాయ్ బరేలిలోని ఛాటో గ్రామంలో ఆయన ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సభకు పురుషుల కంటే మహిళలే ఎక్కువగా హాజరయ్యారు. ఒక రకంగా చెప్పాలంటే ఇది మహిళల సభలా అనిపించింది. ఇంత మంది మహిళలు సభకు హాజరు కావడంతో రాహుల్ లో ఉత్సాహం ఉప్పొంగింది.

ఆ తర్వాత ఆయన ప్రసంగిస్తూ, ఇంతమంది మహిళలు సభకు తరలిరావడం తొలిసారి చూస్తున్నానని అన్నారు. అధిక సంఖ్యలో వచ్చిన మీరు... పురుషులను తప్పుకునేలా చేశారంటూ ప్రశంసించారు. రాహుల్ వ్యాఖ్యల పట్ల మహిళలు కేరింతలు కొట్టారు. ప్రధాని మోదీ చెప్పినట్టు మీ బ్యాంకు ఖాతాల్లోకి రూ. 15 లక్షలు వచ్చాయా? అని రాహుల్ ప్రశ్నించారు. కేవలం సంపన్న వర్గాల కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-కాంగ్రెస్ కూటమిని గెలిపిస్తే మహిళలకు ఉద్యోగావకాశాలను కల్పిస్తామని, వారి కుటుంబ భద్రత కోసం ప్రత్యేక పథకాలను ప్రకటిస్తామని హామీ ఇచ్చారు.

More Telugu News