: 'శశికళ' సినిమాలో ఇదే నా క్లైమాక్స్: రామ్ గోపాల్ వర్మ
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళ పేరుతో సినిమా తీయనున్నట్టు ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. జయలలిత, శశికళల మధ్య ఉన్న బంధంలో ఎవరికీ తెలియని విషయాలను ఈ సినిమాలో చూపిస్తానని ఇదివరకే వర్మ తెలిపాడు. తాజాగా ఈ సినిమా గురించి ఆయన మరోసారి ఆసక్తికరమైన ట్వీట్లు చేశాడు. పళనిస్వామి, పన్నీర్ సెల్వంల మధ్య జరుగుతున్న రాజకీయ నాటకంతో సమాధిలో ఉన్న జయ ఆత్మ శాంతిస్తుందా? అని ప్రశ్నించాడు. ఈ నాటకాలను తట్టుకోలేకపోయిన జయ ఆత్మ... సమాధిలో నుంచి బయటకు రావడమే తన సినిమాలో క్లైమాక్స్ అని తెలిపాడు.
మరోవైపు పరప్పణ అగ్రహార జైల్లో అధికారులతో శశికళ వాదిస్తూ... తానేమైనా చిల్ల దొంగనా? అని ప్రశ్నించిన సంగతి తెలిసిందే. దీనిపై కూడా వర్మ స్పందించాడు. తాను చిల్లర దొంగను కాదు అని శశికళ అనడాన్ని చిల్లర దొంగలు, జేబు దొంగలు స్పూర్తిగా తీసుకోవాలని సూచించాడు. "అసలైన నేరం ఎవరిది? బతకడం కోసం రూ. 600 దొంగతనం చేసిన వారిదా? లేక తమ విలాసవంతమైన జీవితం కోసం... తమపై ఎంతో నమ్మకముంచిన ప్రజలను మోసం చేసి... రూ. 60 కోట్లు కొట్టేసిన దొంగలదా?" అని ప్రశ్నించాడు.