: హీరోయిన్‌పై లైంగిక దాడి వెనక హీరో హస్తం?.. బయటపడిన కొత్త కోణం!

మలయాళ ప్రముఖ నటి భావనపై లైంగికదాడి కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. కుట్రతోనే ఆమెపై దాడి జరిగిందని, దాడి వెనక సినీ ప్రముఖుల హస్తం ఉందనే కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. వృత్తిపరమైన శత్రుత్వంతోనే ఆమెపై దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. రౌడీ షీటర్ సునీల్‌తో కుమ్మక్కైన కొందరు కావాలనే ఈ పనిచేయించి ఉంటారని, ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు కేరళ క్రైంబ్రాంచ్ ఐజీ దినేంద్ర కశ్యప్ తెలిపారు. హీరోయిన్‌పై దాడి చేసిన తర్వాత సునీల్ కుమార్ సినీ పరిశ్రమలోని కొందరితో ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో వారి జోక్యంపైనా విచారణ జరుపుతున్నట్టు ఐజీ తెలిపారు. మరోవైపు హీరోయిన్ వెనక దాడి విషయంలో కుట్రకోణం దాగి ఉందనే అనుమానాలు క్రమంగా బయటపడుతున్నాయి.
 
లైంగికదాడికి గురైన హీరోయిన్‌కు, ఓ హీరోకు మధ్య వైరం ఉందని, ఆ కారణంగా ఆమె పరిశ్రమలో వివక్షకు గురవుతున్నారని నటి మంజు వారియర్ ఆరోపించారు. మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) నిర్వహించిన సమావేశంలో ఆమె కేరళ సినీపరిశ్రమపై నిప్పులు చెరిగారు. సినీ పరిశ్రమ పూర్తిగా మాఫియా గుప్పిట్లో ఉందని ఆరోపించారు. హీరోయిన్‌పై లైంగిక దాడి ఘటనలో కుట్ర ఉందన్నారు. హీరోతో వైరానికి, దాడికి మధ్య ఏమైనా సంబంధం ఉందేమో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు వి.మురళీధరన్ వ్యాఖ్యానించారు. మరోవైపు పరారీలో ఉన్న సునీల్ కుమార్ సహా ముగ్గురు నిందితులు ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించారు.  హీరోయిన్ డ్రైవర్ వాంగ్మూలంతో తమను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు. ఈ పిటిషన్ నేడు (మంగళవారం) విచారణకు రానుంది.

పోలీసుల అదుపులో ఉన్న హీరోయిన్ డ్రైవర్ ఆంటోనీ కొత్త విషయాలు వెల్లడిస్తున్నాడు. లైంగిక దాడి ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేసి రూ.30 లక్షలు వసూలు చేయాలని ప్లాన్ చేసినట్టు తెలిపాడు. గతంలోనూ ఇతడు కిడ్నాప్‌లకు  పాల్పడినట్టు సమాచారం. సునీల్ తన భార్యను కిడ్నాప్ చేయబోతే ఆమె తప్పించుకుందని నిర్మాత సురేశ్ కుమార్ తెలిపారు.  నిందితులను కఠినంగా శిక్షించాలని దక్షిణ భారత ఆర్టిస్ట్స్ అసోసియేషన్(ఎస్ఐఏఏ) డిమాండ్ చేసింది.

More Telugu News