: అందుకే, శశికళ వర్గానికి సుబ్రహ్మణ్య స్వామి అండగా ఉన్నారట!

తమిళనాట రాజకీయ సంక్షోభం నెలకొన్న సమయంలో సీఎం కుర్చీ మళ్లీ పన్నీర్ సెల్వంకే దక్కుతుందని చాలా మంది భావించారు. తమిళ ప్రజల మద్దతు కూడా ఆయనకే వుందని అనుకున్నారు. అయితే, బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి మాత్రం శశికళ కు మద్దతు పలికారు. తనకు మద్దతుగా నిలిచిన ఎమ్మెల్యేల సంతకాలతో ఓ లేఖను గవర్నర్ విద్యాసాగర్ రావుకు సమర్పించిన శశికళకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వాలని, అలా చేయకుంటే కోర్టులో పిటిషన్ వేస్తానని సుబ్రహ్మణ్య స్వామి హెచ్చరించడం విదితమే.

సుబ్రహ్మణ్య స్వామి ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం సొంత పార్టీ నేతలతో పాటు రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే, శశికళ విషయంలో ఎందుకంత పట్టుదలగా ఉన్నాననే విషయాన్ని సుబ్రహ్మణ్య స్వామి తాజాగా చెప్పుకొచ్చారు. శశికళకు హిందుత్వ భావన ఎక్కువగా ఉందని, ఆమె దేవాలయాలకు వెళతారని, అదే, డీఎంకే వాళ్లు హిందూ వ్యతిరేకులని, ఆలయాలను ధ్వంసం చేస్తారని స్వామి వ్యాఖ్యానించారు.

తమిళనాడు సీఎంగా డీఎంకేలోని దేశ ద్రోహులు ఉండటం కంటే అన్నాడీఎంకేలోని అవినీతిపరులు ఉండటమే నయమని, డీఎంకే నేతలు ప్రముఖ దేవాలయాల వ్యవహారాలపై కోర్టుల్లో కేసులు వేస్తారని  సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యానించడం గమనార్హం. కాగా, అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు వెళ్లడంతో ఆమె సన్నిహితుడు పళని స్వామికి ఆయన మద్దతు ప్రకటించడం తెలిసిందే.

More Telugu News