: 150 ఏళ్ల నుంచి ప్రశాంతంగా ఉన్న భారత ఏకైక అగ్నిపర్వతం... ఇప్పుడు బద్దలవుతోంది!

బారెన్ ఐలాండ్ అగ్నిపర్వతం, అండమాన్ - నికోబార్ దీవుల్లో భాగంగా ఉండి, ఇండియాలోని ఏకైక వాల్కనోగా గుర్తింపు పొంది ఉంది. దాదాపు 150 సంవత్సరాల పాటు మౌనంగా ఉండి, ఆపై 1991 నుంచి అప్పుడప్పుడూ లావాను వెదజల్లుతూ వస్తున్న ఈ అగ్నిపర్వతం ఇప్పుడు బద్దలయ్యేందుకు సిద్ధమవుతోంది. అగ్నిపర్వతంపై ఇటీవలి కాలంలో పలుమార్లు 5 నుంచి 10 నిమిషాల పాటు లావా బయటకు వస్తుండటాన్ని గమనించామని, శాంపిల్స్ సేకరించి, లావా కంపోజిషన్ ను పరిశీలిస్తున్నామని అగ్నిపర్వతాన్ని సందర్శించిన ఎన్ఐఓ టీమ్ హెడ్ అభయ్ ముధోల్కర్ వెల్లడించారు.

పగటి పూట బూడిద మేఘాలు కనిపిస్తున్నాయని, రాత్రి పూట ఎరుపురంగులో లావా బయటకు వస్తోందని ఆయన తెలిపారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్ఐఆర్), ఎన్ఐఓ ప్రతినిధులు దీన్ని పరిశీలిస్తున్నారని, ఈ ప్రాంతంలో మరిన్ని చిన్న చిన్న అగ్ని పర్వతాలు కూడా ఉన్నాయని వెల్లడించారు. కాగా, అగ్నిపర్వతం నుంచి లావా మరింతగా బయటకు రావచ్చన్న అంచనాలతో, ఈ ప్రాంతానికి వచ్చే పడవలు పోర్టు బ్లెయిర్ అధికారుల అనుమతి తీసుకోవాలన్న నిబంధనను విధించారు.

More Telugu News