: ఓటు వేయడానికి వెళ్లాలని పట్టుబట్టిన పెళ్లికూతురు... అత్తగారింటికి వెళ్లే కార్యక్రమం వాయిదా!

ఉత్తర ప్రదేశ్‌లో ఎన్నిక‌ల వేడి కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే మూడు విడ‌త‌ల్లో పోలింగ్ ముగిసింది. ఇక నాలుగో విడ‌త పోలింగ్ రేపు జ‌రుగుతుంది. అయితే, ఓటు హ‌క్కును వినియోగించుకునే క్ర‌మంలో ఓ కొత్త‌ పెళ్లి కూతురు త‌న అత్త‌మామ‌ల ఇంటికి వెళ్లే కార్య‌క్ర‌మాన్ని సైతం వాయిదా వేసుకొని ఆద‌ర్శంగా నిలిచింది. రేపు ఓటు వేయ‌డానికి వెళ‌తాన‌ని, అనంత‌ర‌మే అత్త‌గారింటికి వెళ‌తాన‌ని త‌న త‌ల్లిదండ్రుల‌తో పాటు అత్త‌మామ‌ల‌ను కోరింది. అందుకు వారి నుంచి ఆ వ‌ధువుకి అనుమ‌తి కూడా ల‌భించింది.

పూర్తి వివ‌రాలు చూస్తే.. ల‌క్నోకి చెందిన మనీషాకి ఈ రోజు పెళ్లి జరిగింది. వారి సంప్రదాయం ప్రకారం ఆమెను రేపు మెట్టినింటికి సాగ‌నంపాల్సి ఉంది. రేపే ఆ ప్రాంతంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆ పెళ్లికూతురు త‌న‌ ఓటు హక్కును వినియోగించుకునే క్ర‌మంలో ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. మొద‌ట ఆమె తల్లిదండ్రులు, అత్తింటి వారు అందుకు ఒప్పుకోలేదు. త‌మ సంప్ర‌దాయం ప్రకారం పెళ్లయిన మ‌రుస‌టి రోజే బ‌య‌లుదేరాల‌ని చెప్పారు. వారితో వాదించి చివ‌రకి వారికి మనీషా నచ్చచెప్పింది. ప్రతీ మహిళ తమ హక్కుల కోసం పోరాటం చేయాలని ఈ సంద‌ర్భంగా మ‌నీషా పిలుపునిచ్చింది. ఇక ఆ పెళ్లి కూతురిని అత్త‌గారింటికి తీసుకువెళ్లేందుకు పెట్టుకున్న ముహూర్తాన్ని ఈ నెల‌ 21కి వాయిదా వేశారు. త‌మ కూతురు పూర్తి బాధ్య‌త‌తో మెలుగుతున్నందుకు మ‌నీషా తండ్రి మీడియాతో మాట్లాడుతూ హ‌ర్షం వ్య‌క్తం చేశారు.

More Telugu News