: భారత్ పై మారని చైనా తీరు!

ఈ నెల 22న భారత విదేశాంగ కార్యదర్శి, చైనా మంత్రి జాంగ్‌ యేసు ఇరు దేశాల వ్యూహాత్మక అంశాలపై భేటీ కానున్నారు. ఈ నేప‌థ్యంలో చైనా త‌న తీరుని మ‌రోసారి వెళ్ల‌గ‌క్కింది. జైషే-ఈ-మహ్మద్‌ సంస్థ వ్యవస్థాపకుడు, ఉగ్రవాది మసూద్‌ అజర్‌పై నిషేధం విధించాల‌నే అంశంపై భారత్‌కు చైనా వ్య‌తిరేకంగా ప్ర‌వ‌ర్తిస్తోన్న విష‌యం తెలిసిందే. అయితే, మ‌సూద్‌పై నిషేధం విధించాలంటే దానికి సంబంధించిన‌ బలమైన ఆధారాలు ఉండాలంటూ చైనా వ్యాఖ్య‌లు చేసింది.

ఇరు దేశాల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న ఈ భేటీ సంద‌ర్భంగా అంతర్జాతీయ వేదికపై ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు, ద్వైపాక్షిక సంబంధాలతో పాటు ప‌లు అంశాలు చ‌ర్చించ‌నున్నారు. ఈ నేపథ్యంలో మసూద్‌పై నిషేధం అంశంపై ఎందుకు మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని చైనా ప్రతినిధిని ప్రశ్నించగా పై విధంగా స‌మాధానం ఇచ్చారు. మ‌రోవైపు ఎన్‌ఎస్‌జీ స‌భ్య‌త్వం విషయంలో భార‌త్ ప‌ట్ల‌ ఎందుకు సానుకూలంగా లేర‌ని చైనాని ప్ర‌శ్నించ‌గా, 'ప‌లు విష‌యాల‌పై విభేదాలు ఉండటం సాధారణం' అంటూ జ‌వాబు దాటవేశారు.

More Telugu News