: ఇకపై బ్యాంకుల ద్వారా రైల్వే టిక్కెట్లు?

ప్రయాణికుల సౌకర్యార్థం ఇకపై బ్యాంకుల ద్వారా రైల్వే టిక్కెట్లను ఇచ్చే ఉద్దేశంలో భారతీయ రైల్వేస్ ఉన్నట్లు సమాచారం. ఇందులో భాగంగా  సాధారణ తరగతి టిక్కెట్లను బ్యాంకుల నుంచి ఇచ్చేందుకు రైల్వే సన్నద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి భారతీయ రైల్వేస్ - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య  ప్రతిపాదనలు చివరి దశలో వున్నాయని, విధివిధానాలను రూపొందిస్తున్నారని తెలుస్తోంది. ఈ ప్రతిపాదనలలో ముఖ్యంగా రెండు ఉన్నాయని, వాటిలో బ్యాంకులలో ఆటోమేటిక్ వెండింగ్ మిషన్ ఏర్పాటు చేయడం ద్వారా రైల్వే టిక్కెట్లు అందుబాటులో ఉంచడం ఒకటి. ఏటీఎంలలో మార్పులు చేసి అక్కడి నుంచి రైల్వే టిక్కెట్ బుకింగ్ సిస్టమ్ కు అనుసంధానం చేయాలనేది మరొకటి.

కాగా, జార్ఖండ్ రాష్ట్రంలోని జంషెడ్ పూర్ లో ఉన్న మ్యాంగో పోస్టాఫీస్, బస్టాండ్ ల లో, టాటా నగర్ రైల్వేస్టేషన్ లో ఏర్పాటు చేసిన కరెన్సీ - కమ్ - కాయిన్ ఆటోమేటెడ్ టికెట్ వెండింగ్ మెషీన్స్ (సీఓఏటీవీఎం)ల నుంచి రైల్వే టిక్కెట్లను విక్రయిస్తున్నారు. తద్వారా క్యూ లలో గంటలకు గంటలు నిలబడే బాధ ప్రయాణికులకు తప్పుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. బ్యాంకుల ద్వారా రైల్వే టిక్కెట్లు విక్రయించేందుకు గత ఏడాది నుంచి రైల్వే బోర్డు ప్రయత్నాలు చేస్తోందని, ఈ ఏడాది ఏప్రిల్ లో ఈ ప్రాజెక్టు తుది రూపు దాల్చుతుందని సంబంధిత అధికారుల సమాచారం.

More Telugu News