: తన మంత్రివర్గం వివరాలు ప్రకటించిన పళనిస్వామి.. సోమవారమే బల నిరూపణ
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని తమకు రాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు నుంచి ఆహ్వానం వచ్చిన నేపథ్యంలో అన్నాడీఎంకే శాసనసభ పక్షనేత పళనిస్వామి తన కేబినెట్ లోని మంత్రుల వివరాలను వెల్లడించారు. ఆర్థిక, హోం శాఖలను పళనిస్వామి తన దగ్గరే ఉంచుకున్నారు. ఇక స్కూల్ ఎడ్యుకేషన్, క్రీడా శాఖ మంత్రిగా సెంగొట్టియన్, సమాచార మంత్రిగా కడంబుల్ రాజు, చేనేత శాఖ మంత్రిగా కోదండపాణి, పశుసంవర్థక శాఖ మంత్రిగా బాలకృష్ణా రెడ్డి, విద్యాశాఖ మంత్రిగా అలెగ్జాండర్, అటవీ శాఖ మంత్రిగా శ్రీనివాసన్ లను నియమించనున్నట్లు ఆయన గవర్నర్కు పంపిన నివేదికలో పేర్కొన్నారు.
కాగా, అసెంబ్లీలో 15 రోజులలోపు బలం నిరూపించుకోవాలని గవర్నర్ విద్యాసాగర్ రావు సూచించిన మేరకు పళనిస్వామి వచ్చే సోమవారమే బలనిరూపణకు సిద్ధమని తెలిపారు. మరికాసేపట్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయనున్నారు.