: మూడు చీరలు, గ్లాస్, ప్లేట్, చెంబు, దిండు, దుప్పటి... జైల్లో శశికళ ఆస్తిదే!

నిన్న సాయంత్రం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు వెళ్లిన శశికళ, ఇళవరసిలు కాసేపు మాట్లాడుకుంటూ కనిపించారని, ఆపై నిద్రపోయారని జైలు అధికారులు తెలిపారు. కనీసం ఫ్యాన్ కూడా లేని జైలు బ్యారక్ లో, శశికళ కటిక నేలపై పడుకున్నారు. ఆమెను ప్రత్యేక ఖైదీగా పరిగణించేందుకు కోర్టు అంగీకరించని వేళ, సాధారణ ఖైదీలకు అందించే వస్తువులనే ఆమెకు కూడా ఇచ్చారు. జైలుకు వచ్చిన ఆమెకు నిబంధనల మేరకు మూడు చీరలు, గ్లాస్, ప్లేట్, చెంబులతో పాటు ఓ దిండు, దుప్పటి అందించామని జైలు వర్గాలు తెలిపాయి.

నేటి నుంచి శశికళ తన చీరలను తానే ఉతికి ధరించాల్సి ఉంటుంది. నిన్న రాత్రి రెండు చపాతీలను ఆమెకు ఇవ్వగా, వాటిని తినేందుకు శశికళ ఆసక్తిని చూపలేదని సమాచారం. ఆపై ఇంటి నుంచి వచ్చిన భోజనం తినేందుకు ఆమెకు అనుమతి ఇవ్వగా, కొంచెమే తిన్నారని, అర్ధరాత్రి నిద్రపట్టక, జైలు సిబ్బందిని పిలిచి మంచి నీళ్లు అడిగారని ఓ అధికారి తెలిపారు. నేటి ఉదయం మాత్రం మిగతా ఖైదీలతో సమానంగా వెజిటబుల్ పలావ్ ను అల్పాహారంగా అందించామని జైలు వర్గాలు తెలిపాయి. సోమ, శుక్రవారాల్లో ఉప్మాను, మంగళ, శనివారాల్లో అటుకులు, బుధవారం లెమన్ రైస్, గురువారం వెజిటబుల్ పలావ్, ఆదివారం పులిహోరలను ఖైదీలకు అందిస్తామని అన్నారు.

More Telugu News