: ‘కళ’ తప్పిన ‘వేద నిలయం’.. ఇక స్మారక మందిరం!

సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ భవితవ్యం ఏమిటో తేలిపోయింది. జయలలిత మరణానంతరం పోయెస్‌గార్డెన్‌లోని ఆమె నివాసం ‘వేద నిలయం’లో శశికళ, ఆమె సోదరుడి భార్య ఇళవరసి కాలుమోపారు. అక్కడి నుంచే శశికళ చక్రం తిప్పారు. ఇప్పుడు సుప్రీం తీర్పుతో వారు జైలుకు వెళ్లనున్నారు. అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో ప్రస్తుతం ‘వేద నిలయం’ కళ తప్పింది. ఇప్పుడది ఖాళీ కానుంది.

ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వేద నిలయాన్ని స్మారక మందిరం చేస్తారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇదే డిమాండ్‌తో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం  వారం రోజులుగా సంతకాల సేకరణ ఉద్యమాన్ని కూడా చేపట్టారు. అన్నాడీఎంకే వర్గాలతోపాటు ప్రజల నుంచి కూడా దీనికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. ‘అమ్మ’ నివసించిన వేదనిలయం తమకు మందిరంతో సమానమని, అందులో ఇతరులు నివసించేందుకు అంగీకరించేది లేదని పార్టీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. సుప్రీం తీర్పు మరోలా వచ్చి ఉంటే ఎలా ఉండేదో కానీ ఆమెకు వ్యతిరేకంగా రావడంతో వేద నిలయాన్ని స్మారక మందిరంగా చేయడం ఇప్పుడు మరింత సులభమైందని చెబుతున్నారు.  
 

More Telugu News