: ’పన్నీర్’ కు జయ మేనకోడలు మద్దతు.. ‘అమ్మ’ సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించిన వైనం!

తమిళనాడులో ఊహించని రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. శశికళ వర్గానికి చెక్ పెట్టాలని చూస్తున్న పన్నీర్ సెల్వం.. జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ ను అనూహ్యంగా తెరపైకి తెచ్చారు. జయలలిత సమాధి వద్దకు పన్నీర్ సెల్వం బృందం, దీప కొంచెం సేపటి క్రితం చేరుకున్నారు. జయలలితకు నివాళులర్పించారు. అనంతరం, దీప మాట్లాడుతూ, పన్నీర్ సెల్వంకు తన బహిరంగ మద్దతు ప్రకటిస్తున్నానని, పార్టీ భవిష్యత్ కోసం ఆయనతో కలిసి పని చేస్తానని చెప్పారు. జయలలిత కోరుకున్న వ్యక్తే  సీఎంగా ఉండాలని, అన్నాడీఎంకే పార్టీకి ఎవరు నేతృత్వం వహించినా శశికళకు కీలుబొమ్మలా ఉండొద్దని, జయలలిత లాగా పరిపాలించాలని ఆమె సూచించారు. కాగా, జయలలిత సమాధి వద్దకు పన్నీర్ సెల్వం, దీప చేరుకున్నారనే సమాచారం తెలుసుకున్న అన్నాడీఎంకే పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో మెరీనా బీచ్ వద్దకు చేరుకున్నారు.


More Telugu News