: సుప్రీంకోర్టు తీర్పును గవర్నర్ ముందే ఊహించారా?

ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన బలం తనకు ఉందని, ముఖ్యమంత్రి పదవిని చేపట్టేందుకు తనను ఆహ్వానించాలని తమిళనాడు తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావుకు శశికళ గత వారం విన్నవించారు. ఆయన నుంచి తాను ఊహించిన స్పందన రాకపోవడంతో, రెండు పర్యాయాలు ఆయనకు లేఖలు కూడా రాశారు. మీడియా ముందుకు వచ్చి తన అసహనాన్ని వ్యక్తం చేశారు. అయినప్పటికీ, విద్యాసాగర్ రావు మాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకోకుండా, వేచి చూసే ధోరణిని అవలంబించారు. సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉండబోతోందో గవర్నర్ ముందుగానే ఊహించారని... అందుకే ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరినీ ఆహ్వానించకుండా ఆయన తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వచ్చారని విశ్లేషకులు చెబుతున్నారు. కేంద్ర సలహాను కూడా ఆయన తీసుకున్నారని... నిర్ణయాన్ని వెలువరించకుండా, తెలివిగా జాప్యం చేస్తూ వచ్చారని వార్తలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానించిన తర్వాత, సుప్రీంకోర్టు తీర్పు ఆమెకు వ్యతిరేకంగా వెలువడితే... ఆ తర్వాత మరోసారి రాజకీయ సంక్షోభం తలెత్తుతుందని గవర్నర్ గత వారం వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే, పన్నీర్ సెల్వం రాజీనామాను గవర్నర్ ఆమోదించినప్పటికీ... శశికళను మాత్రం ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించలేదు. సుప్రీం తీర్పు ఎలా ఉండబోతోందో గవర్నర్ కు ముందే తెలిసి ఉండొచ్చని కొందరు సీనియర్ నేతలు చెబుతున్నారు.

More Telugu News