: నాడు అత్యాచారం చేశారు... నేడు గొంతు పిసికి చంపేశారు!

సరిగ్గా మూడేళ్ల క్రితం 21 ఏళ్ల ఆ యువతిని ఎనిమిది మంది దుర్మార్గులు సామూహికంగా మానభంగం చేశారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లోని సుల్తానాపూర్ ప్రాంతంలో జరిగింది. అత్యాచారానికి పాల్పడిన వారిలో సమాజ్ వాదీ పార్టీ ఎమ్మెల్యే అరుణ్ వర్మ కూడా ఉన్నట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సమయంలోనే... ఎమ్మెల్యేను విచారించిన పోలీసులు ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చారు. ఆ తర్వాత విచారణ ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు ఒకరిని కూడా దోషులుగా తేల్చలేదు. పైగా ప్రతి విచారణలో దోషులు తప్పించుకుంటూనే ఉన్నారు.

ఈ క్రమంలో, శనివారం సాయంత్రం ఇంటి బయట ఉన్న బాత్ రూమ్ కు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. దీంతో, పోలీసులకు ఆమె తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు గాలింపు జరపగా... ఓ ప్రాంతంలో ఆమె మృతదేహం లభించింది. ఆమె గొంతు నులిమి చంపేసినట్టు ఆనవాళ్లు లభించాయి. ఆమెపై అత్యాచారం చేసిన వారే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే కేసును నమోదు చేశారు. గతంలో వీరి కుటుంబానికి పోలీసు రక్షణ ఉండగా... ఇటీవలే రక్షణను తొలగించారు. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది.

More Telugu News