: మా వల్ల కావడం లేదు... పన్నీర్ ఇంటికి అదనపు బలగాలను కోరిన అధికారులు

క్షణక్షణానికీ తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నివాస ప్రాంతమైన కుమారస్వామి రాజా సలాయ్ ఇంటికి వస్తున్న ప్రజలు, అభిమానుల సంఖ్య పెరుగుతూ ఉండటంతో, పరిస్థితిని అదుపు చేయలేకపోతున్న పోలీసు అధికారులు, మరింత బలగాలను పంపాలని నిర్ణయించాయి. పన్నీర్ భద్రతను పర్యవేక్షిస్తున్న అధికారుల కోరిక మేరకు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఐఎస్ఎఫ్ బలగాలను ఆయన ఇంటికి పంపనున్నట్టు తెలుస్తోంది. ఈ ఉదయం నుంచి ఆయన ఇంట్లోనే ఉండి, తన వద్దకు వస్తున్న ప్రతి ఒక్కరి నుంచి అభినందనలు స్వీకరిస్తూ ఉండటంతో, లక్షలాది మంది ప్రజలు తరలివచ్చారు.

వీధికి అడ్డుగా ఉన్న బారికేడ్లను తోసేసుకుని లోపలికి జొరబడుతున్న వేళ, స్వల్ప సంఖ్యలో ఉన్న పోలీసులు ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఆపై కూడా భారీ ఎత్తున అభిమానులు వస్తుండటం, వారిలో అసాంఘిక శక్తులు జొరబడే అవకాశాలు ఉన్నాయన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో అదనపు భద్రత కల్పించాలని నిర్ణయించారు. పన్నీర్ ఇంటికి అర కిలోమీటర్ దూరంలోనే బారికేడ్లు, బలగాలను మోహరించి, వచ్చిన వారిని క్షుణ్ణంగా పరిశీలించిన మీదటే లోపలికి పంపాలని అధికారులు ఆదేశాలిచ్చారు.

More Telugu News