: పన్నీర్ సెల్వం నిర్ణయంతో పెరిగిన ఉద్రిక్తత... భారీగా మోహరించిన పోలీసులు

గోల్డెన్ బే రిసార్టులో శశికళ దాచివుంచిన ఎమ్మెల్యేలను కలవాలని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో రిసార్టు పరిసర ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పన్నీర్ ఇక్కడికి రానున్నారని తెలుసుకున్న శశికళ వర్గీయులు భారీ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటుండగా, వారిని రిసార్ట్ పరిసర ప్రాంతాల్లోకి వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ఇదే సమయంలో పన్నీర్ అనుచరులు సైతం ఇక్కడికి పయనం కావడంతో, ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరుగకుండా బందోబస్తు పెంచారు.

కాగా, ఈ రిసార్టులో అసలు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయమై లెక్కలు తెలియడం లేదు. తొలుత ఇక్కడికి 120 మంది ఎమ్మెల్యేలకు పైగా తరలించినప్పటికీ, అందులో కొందరిని మరో చోటికి తరలించారని సమాచారం. 30 మంది వరకూ ఆంధ్రప్రదేశ్ లోని రహస్య ప్రాంతాలకు తరలించినట్టు వార్తలు వస్తున్నాయి. వీరిని తిరుపతి సమీపంలోని ఓ స్టార్ హోటల్ లో ఉంచినట్టు వదంతులు వినిపిస్తున్నా, దీనిపై అధికారిక సమాచారం లేదు. ఇక పన్నీర్ గోల్డెన్ బే రిసార్టుకు వెళ్లి ఎమ్మెల్యేలతో వారి అభిప్రాయాన్ని ప్రత్యక్షంగా తెలుసుకోవాలని భావిస్తుండటం, ఆయన్ను అడ్డుకునేందుకు శశికళ వర్గం యత్నిస్తుందన్న అంచనాలతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది.

More Telugu News