: ప్రమాణ స్వీకారానికి శశికళను ఆహ్వానిస్తే.. ఆమరణ దీక్షకు దిగుతానన్న కానిస్టేబుల్

శశికళ కనుక ముఖ్యమంత్రి అయితే తాను జయలలిత సమాధి వద్ద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని జయ వీరాభిమాని, తేని జిల్లాలోని ఓడైపట్టి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ వేల్‌మురుగున్ హెచ్చరించారు. గతంలో జయలలితపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయినప్పుడు చెన్నైలోని డీజీపీ కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి  పాల్పడ్డానని ఆయన పేర్కొన్నారు. తర్వాత ‘అమ్మ’ ఆర్కే నగర్ నుంచి గెలుపొంది  సీఎం అయ్యాక గుండు గీయించుకుని మొక్కు చెల్లించుకున్నానని తెలిపారు. అనారోగ్యంతో జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరినప్పుడు చెన్నై వడపళనిలోని మురుగన్ ఆలయంలో శరీరానికి శూలం గుచ్చుకుని ప్రార్థన చేసినట్టు వేల్‌మురుగన్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా శశికళ ముఖ్యమంత్రి కావడాన్ని అంగీకరించేది లేదన్నారు. గవర్నర్ కనుక శశికళను ఆహ్వానిస్తే జయ సమాధి వద్ద నేటి(ఆదివారం) నుంచే ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని పేర్కొన్నారు.

More Telugu News