Stalin: త్వరలో తమిళనాడులో డీఎంకే పాలన.. కార్యకర్తలకు లేఖ రాసిన స్టాలిన్

త్వరలో మన పార్టీ అధికారంలోకి రాబోతోందంటూ డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ ఆ పార్టీ కార్యకర్తలకు లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది. ప్రజాభీష్టం నెరవేరే సమయం ఆసన్నమైందంటూ శనివారం పార్టీ శ్రేణులకు రాసిన బహిరంగ లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అధికారం కోసం కుమ్ములాటలు తప్ప ప్రజల గురించి  పట్టించుకునే వారు కరువయ్యారని, ప్రజా సమస్యలను పట్టించుకునే నాథుడే లేడని ఆయన పేర్కొన్నారు.

సభ్యసమాజం తలదించుకునే విధంగా రాష్ట్రంలో నేరాలు జరుగుతున్నాయని, అరియలూరులో నందిని అనే చిన్నారిపై జరిగిన అత్యాచార ఘటన ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు భద్రత కరువైందని లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం కోసం రెండు వర్గాలు కుమ్ములాడుకుంటుండడంతో ఎవరి మాట వినాలో తెలియక పోలీసులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో తిరిగి డీఎంకే అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని స్టాలిన్ ఆ లేఖలో పేర్కొన్నారు.

More Telugu News