: నాకు చెప్పకుండా ఆ ఏర్పాట్లు ఏమిటి?: సీఎస్, డీజీపీలకు చివాట్లు పెట్టిన తమిళనాడు గవర్నర్!

తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్ లపై ఆ రాష్ట్ర తాత్కాలిక గవర్నర్ విద్యాసాగర్ రావు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. రాజ్ భవన్ నుంచి ఎలాంటి ఆదేశాలు జారీ కాకుండానే, శశికళ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. తన అనుమతి లేకుండానే ఏర్పాట్లు చేసేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి ఆదేశాలతో ఇదంతా చేశారని ఆయన నిలదీసినట్టు సమాచారం. మెరీనా తీరంలో ఉన్న మద్రాస్ యూనివర్శిటీలోని సెంటినరీ హాలును శశికళ ప్రమాణ స్వీకారం కోసం ముస్తాబు చేసిన సంగతి తెలిసిందే.

యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమం కోసం ఏర్పాట్లు చేశారు. వేదిక సుందరీకరణ కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎస్, డీజీపీ, చెన్నై పోలీస్ కమిషనర్ లపై విద్యాసాగర్ రావు మండిపడ్డారు. తమిళనాడులో ప్రస్తుతం రాజకీయ సంక్షోభం నెలకొందని... తన సూచనలు లేకుండా ఏ పనీ చేయరాదంటూ వీరిని గవర్నర్ ఆదేశించారు. అయితే, ముగ్గురూ కలిసి గవర్నర్ కు సంజాయిషీ ఇవ్వడంతో, ఆయన చల్లబడ్డారు. 

More Telugu News