: తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉందంటున్న రాజ్ భవన్ వర్గాలు!

తమిళనాడులో ప్రస్తుత పరిస్థితి అదుపులోనే ఉందని రాజ్ భవన్ వర్గాలు పేర్కొన్నట్లు ఒక న్యూస్ ఛానెల్ ‘ఎక్సుక్లూజివ్ రిపోర్టు’ పేరిట తెలిపింది. మునుపెన్నడూ లేని పరిస్థితి తమిళనాడులో ఉందని, రాజ్యాంగబద్ధంగా అన్ని విషయాలు పరిశీలించాకే, ఓ నిర్ణయానికి రావాలన్న ఆలోచనలో గవర్నర్ ఉన్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినట్లు పేర్కొంది. ఆర్టికల్ 164(4) ప్రకారం ఎమ్మెల్యే కాని వ్యక్తి ఆరు నెలల్లో ఎన్నిక కావాలని, శశికళ ఆరు నెలల్లో ఎన్నికయ్యే పరిస్థితులు ఉన్నాయా? అనే విషయాన్ని పరిగణనలోకి గవర్నర్ తీసుకుంటున్నారని తెలిపింది.

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గత తీర్పును అనుసరించి చూస్తే, పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చని న్యాయ నిపుణులు భావిస్తున్నారని, భవిష్యత్ పరిణామాలపై గవర్నర్ దృష్టి సారించారని పేర్కొంది. ఆపద్ధర్మ సీఎం ఉన్నందున రాష్ట్రంలో అధికార శూన్యత లేదని, పరిస్థితి అదుపులోనే ఉందని గవర్నర్ విశ్వసిస్తున్నట్టుగా తెలుస్తోందని, రోజులు గడిచిన కొద్దీ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించ వచ్చన్న ఆందోళనలపై గవర్నర్ దృష్టి సారించారని, సీఎస్, ఉన్నతాధికారులతో ఎప్పటికప్పుడు పరిస్థితిని విద్యాసాగర్ రావు సమీక్షిస్తున్నారని  ఆ రిపోర్టులో పేర్కొనడం గమనార్హం.

More Telugu News