: అమెరికాలో బిజీబిజీగా పవన్ కల్యాణ్.. రిపబ్లికన్, డెమొక్రాటిక్ సెనేటర్లతో భేటీ కానున్న జనసేనాని

అమెరికా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ బిజీబిజీగా గడుపుతున్నారు. హార్వర్డ్ యూనివర్శిటీ విద్యార్థుల సదస్సు కోసం వెళ్లిన పవన్... ఎన్నో కార్యక్రమాల్లో పాలుపంచుకుంటున్నారు. ఈరోజు మధ్యాహ్నం (అమెరికా కాలమానం ప్రకారం) 12 గంటల నుంచి 2 వరకు అమెరికా కాంగ్రెస్ సభ్యులు, సెనేటర్లు, అమెరికా న్యూక్లియర్ పాలసీ రూపకర్తలతో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొనబోతున్నారు. 2 గంటల తర్వాత హ్యాంప్ షైర్ గవర్నర్ తో పవన్ సమావేశమవుతారు.

3.30 గంటలకు నార్త్ హ్యాంప్ షైర్ చేరుకుని... అమెరికన్ కాంగ్రెస్ సభ్యురాలు, తెలుగు సంతతి మహిళ అయిన లత మంగపూడితో పవన్ భేటీ అవుతారు. సాయంత్రం 4 గంటలకు నషువాలోని రివర్ యూనివర్శిటీ దగ్గర భారతీయ సంతతి వారు నిర్వహిస్తున్న కార్ ర్యాలీలో ఆయన పాల్గొంటారు. అనంతరం ఎన్నారైలు ఏర్పాటు చేసిన విందుకు ఆయన చేరుకుంటారు. ఈ సందర్భంగా రిపబ్లికన్, డెమోక్రాటిక్ పార్టీలకు చెందిన సెనేటర్లు, నషువా మేయర్, ఎన్నారైలను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అనంతరం విందు కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ వివరాలన్నింటినీ జనసేన పార్టీ వెల్లడించింది.

More Telugu News