: ఇన్ఫోసిస్ లో సంక్షోభం తలెత్తిన మాట నిజమే: అంగీకరించిన నారాయణమూర్తి

భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ లో సంక్షోభం నెలకొన్న మాట వాస్తవమేనని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి అంగీకరించారు. అత్యున్నత ప్రమాణాలకు పెద్ద పీట వేస్తూ, అత్యంత పారదర్శకతతో కొనసాగిన ఇన్ఫోసిస్ ఇబ్బందులను ఎదుర్కొంటోందని ఆయన చెప్పారు. ప్రస్తుతం ఇన్ఫీలో కార్పొరేట్ గవర్నెన్స్ దారుణంగా పడిపోయిందని... బోర్డులోని పారదర్శకత ప్రామాణికత పెద్ద సమస్యగా మారిందని తెలిపారు. సీఈఓ విశాల్ సిక్కాతో ఎలాంటి సమస్య లేదని చెప్పారు. ఇటీవల సంస్థకు రాజీనామా చేసిన సీఎఫ్ఓ రాజీవ్ బన్సల్ కు 12 నెలల ప్యాకేజీ కంటే అదనంగా 10 రెట్లు ఎలా చెల్లిస్తారని ఆయన ప్రశ్నించారు. ఈ అసాధారణ చెల్లింపుల వెనుక అసలు కారణం ఏమటని అన్నారు.

సంస్థ పనితీరు పట్ల మిడిల్ లెవెల్, జూనియర్ లెవెల్ ఉద్యోగులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని... దాదాపు 1800కు పైగా ఈమెయిల్స్ తనకు అందాయని నారాయణమూర్తి తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఉద్యోగుల నైతిక సామర్థ్యాన్ని దెబ్బతీస్తాయని చెప్పారు. ఎంతో మందిమి కలసికట్టుగా దశాబ్దాల పాటు కష్టపడి ఇన్ఫోసిస్ ను అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దామని... కానీ, ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు తనను ఎంతో ఆవేదనకు గురి చేస్తున్నాయని తెలిపారు.

More Telugu News