: సారీ చెప్పిన కోడెల.. తన వ్యాఖ్యలు బాధ కలిగించి ఉంటే క్షమించాలన్న స్పీకర్

మహిళలు వంటింటికే పరిమితమైతే వేధింపులు ఉండవని వ్యాఖ్యానించిన ఏపీ శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధ కలిగించి ఉంటే తనను క్షమించాలని కోరారు. బుధవారం విజయవాడలో నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’ కార్యక్రమంలో స్పీకర్ మాట్లాడుతూ మహిళలు బయటకు రావడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. వారు వంటింటికే పరిమితమైతే వేధింపులు ఉండవని పేర్కొన్నారు. ఆయన వ్యాఖ్యలను మహిళా సంఘాల ఐక్య వేదిక ఖండించింది. ‘మహిళా సాధికారత-సవాళ్లు’ అంశంపై గురువారం విజయవాడలోని ఎంబీ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పీకర్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. దీంతో స్పందించిన కోడెల మాట్లాడుతూ తన వ్యాఖ్యలు ఎవరికైనా బాధకలిగించి ఉంటే క్షమించాలని, తన ఉద్దేశం అది కాదని పేర్కొన్నట్టు  మహిళాసంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు తెలిపారు.

More Telugu News