: హరీష్, తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు రాళ్లతో కొడతారు: పొన్నం ప్రభాకర్

కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ మంత్రి హరీష్ రావు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆ పార్టీ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. ఈ రోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రాజెక్టులు పూర్తి చేస్తే, టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో తూములు మాత్రమే నిర్మించి, తామే ప్రాజెక్టులు కట్టామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు రాళ్లతో కొడతారని, తన మంత్రి పదవిని కాపాడుకునేందుకు హరీష్ ఈ విధమైన ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన, చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి చేయట్లేదని, వాటిని పూర్తి చేస్తే  తమ పార్టీకి ఎక్కడ మంచి పేరు వస్తుందో అని తాత్సారం చేస్తోందని అన్నారు. ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని హరీష్ కు పొన్నం సవాల్ విసిరారు.

More Telugu News