: పన్నీర్ సెల్వం ఆ తప్పు చేస్తారని నేను భావించడం లేదు: గౌతమి

పన్నీర్ సెల్వం చరిత్రలో నిలిచిపోయేంత పెద్ద తప్పు చేస్తారని తాను భావించడం లేదని సినీ నటి గౌతమి తెలిపారు. చెన్నైలో ఆమె మాట్లాడుతూ, పన్నీర్ సెల్వం మళ్లీ శశికళతో కలిసిపోతారని తాను భావించడం లేదని అన్నారు. ఒకవేళ అలా కలసిిపోతే మాత్రం ఆయన తమిళనాడు చరిత్రలో అతిపెద్ద తప్పు చేసిన వ్యక్తి అవుతారని ఆమె పేర్కొన్నారు. జయలలిత సమాధితో నాటకాన్ని ప్రారంభించిన వ్యక్తిగా నిలిచిపోయే ప్రమాదం ఉందని, అందుకే ఆయన అలాంటి తప్పిదం చేస్తారని తాను భావించడం లేదని అన్నారు. అన్నింటికీ ఎదురునిలవాలన్న లక్ష్యంతోనే ఆయన శశికళ వర్గం నుంచి బయటికి వచ్చి ఉంటారని ఆమె తెలిపారు. జయలలిత మరణంపై వాస్తవాలు తెలియనంతకాలం ప్రజలు పన్నీర్ సెల్వంకే మద్దతిస్తారని ఆమె చెప్పారు. వాస్తవాలేంటన్నది తెలియాలన్నదే తన లక్ష్యమని, సొంత ముఖ్యమంత్రికి ఏం జరిగిందో తెలియని స్థితిలో ప్రజలు ఉండడం క్షేమకరం కాదని ఆమె తెలిపారు. అందుకే జయలలిత మరణంపై ప్రశ్నిస్తున్నానని ఆమె చెప్పారు. 

More Telugu News