panner selvam: సోషల్ మీడియాలో ఒక్కసారిగా హీరో అయిపోయిన పన్నీర్‌ సెల్వం

అమ్మ జ‌య‌ల‌లిత వీర విధేయుడి తిరుగుబాటుతో అన్నాడీఎంకే ముఖ చిత్రం మారిపోతోంది. త‌న బ‌ల‌మేంటో త్వ‌ర‌లోనే అంద‌రికీ తెలుస్తుంద‌ని త‌మిళ‌నాడు ఆపద్ధర్మ ముఖ్య‌మంత్రి పన్నీర్‌ సెల్వం  స‌వాలు విస‌ర‌డంతో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో హీరో అయిపోయారు. నిన్న‌టి వ‌ర‌కు ప‌న్నీర్ సెల్వం ర‌బ్బ‌రు స్టాంపులాంటి వార‌ని నెటిజ‌న్లు జోకులు పేల్చుకున్నారు. స్త్రీల‌కు లేచి నిలబడి సీటు ఇచ్చే సంస్కారం ఉన్నవార‌ని సెటైర్లు వేశారు. కానీ, పన్నీరు సెల్వం తీరు మార్చుకొని త‌న అస‌లు స్వ‌రూపాన్ని ప్ర‌ద‌ర్శిస్తుండ‌డంతో ఈ రోజు ఆయ‌న‌పై నెటిజ‌న్లు కూడా తీరు మార్చుకొని ప్ర‌శంస‌లు కురిపిస్తూ ఆయనను హీరోగా పేర్కొంటున్నారు.

ప‌న్నీర్‌ సెల్వంకు మద్దతుగా ప్రజలతో పాటు పలువురు డీఎంకే, అన్నాడీఎంకే నేతలు కూడా సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మెరీనా బీచ్ వ‌ద్ద ప్రారంభించిన తిరుగుబాటులో ప‌న్నీర్ సెల్వం గెలిచి తీరుతార‌ని ఓ అభిమాని పేర్కొన్నాడు.
అన్ని విషయాలను పన్నీర్ సెల్వం బయటకు చెప్పి మంచి నిర్ణయం తీసుకున్నారని ప‌లువురు పేర్కొంటున్నారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యే హరి ప్రభాకరన్‌ ట్వీట్ చేస్తూ...  పదవి గురించి భయపడట్లేదని, అమ్మ త‌మ‌తోనే ఉన్నారని పార్టీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు ప‌న్నీర్ సెల్వం వెంటే ఉన్నార‌ని పేర్కొన్నారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పన్నీరు మద్దతుదారులు, కార్యకర్తలు ఆయ‌న ఇంటికి చేరుకుంటున్నారు.



More Telugu News