: సీన్ రిపీట్.. మ‌ళ్లీ ఖాళీగా క‌నిపిస్తోన్న ఏటీఎంలు!

పెద్ద‌నోట్ల ర‌ద్దు నేప‌థ్యంలో దేశ వ్యాప్తంగా న‌గ‌దు కొర‌త ప‌రిస్థితి ఏర్ప‌డి ప్ర‌జ‌లు అష్ట‌క‌ష్టాలు ప‌డ్డార‌న్న విష‌యం తెలిసిందే. ఏటీఎంల ముందు గొడ‌వ‌లు, లాఠీ ఛార్జీలు కూడా జ‌రిగాయి. అయితే, ప‌రిస్థితుల‌న్నీ చ‌క్క‌దిద్దాయ‌నుకుంటున్న స‌మ‌యంలో మ‌ళ్లీ ఇప్పుడు ఏటీఎంలు ఖాళీగా క‌నిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంలలో సుమారు నాలుగోవంతు వాటిలో న‌గ‌దు ఉండట్లేదు. ఏటీఎంల వ‌ద్ద‌కు వ‌స్తోన్న ఖాతాదారులకు మ‌ళ్లీ  నో క్యాష్ బోర్డులు క‌నబ‌డుతున్నాయి. ఫిబ్ర‌వ‌రి నెల మొదటి వారం కావడంతో వేత‌న‌జీవులు అధిక సంఖ్య‌లో ఏటీఎంల నుంచి న‌గ‌దు డ్రా చేసుకున్నారు. అలాగే కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే విత్‌డ్రా పరిమితిని కూడా పెంచడంతో ప‌లు చెల్లింపుల కోసం ప్రజలు భారీగా డబ్బులు తీసేస్తున్నారు.

దీంతో ఏటీఎంల‌లో అధిక శాతం కేంద్రాలు ఖాళీగా ఉంటున్నాయి. అసంఘటిత రంగంలోని కార్మికులకు వేత‌నాలు డబ్బు రూపంలోనే చెల్లిస్తున్నారు. దీంతో య‌జ‌మానులు కూడా చెల్లింపులు చేయాల్సి ఉన్నందున నగదు ఎక్కువగా తీస్తున్నార‌ని బ్యాంకు అధికారులు చెబుతున్నారు. మ‌రో రెండు, మూడు రోజుల్లో ఈ నగదు కొరత తీరుతుందని అంటున్నారు. అన్ని ఏటీఎంల‌లో క‌లిపి రోజుకు దాదాపు రూ. 12వేల కోట్ల నగదును పెడుతున్నారని చెప్పారు. కాగా, నోట్ల రద్దుకు ముందు సుమారు రూ.13వేల కోట్లు పెట్టేవారు.

More Telugu News