: నన్నే తొలగిస్తారా? పార్టీలోనే ఉంటా.. నేనేంటో నిరూపిస్తా!: నిప్పులు చెరిగిన పన్నీర్ సెల్వం

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళపై పన్నీర్‌ సెల్వం నిప్పులు చెరిగారు. కోశాధికారి పదవి నుంచి తనను తప్పించడంపై మండిపడ్డారు. ‘అమ్మ’ ప్రసాదించిన పదవి నుంచి తనను తీసేసే హక్కు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. తాను పార్టీని వీడేది లేదని, కొన్ని గంటల్లోనే తానేంటో నిరూపిస్తానని హెచ్చరించారు. మంగళవారం రాత్రి జయ సమాధి నుంచి నేరుగా ఇంటికి చేరుకున్న ఆయనను కలుసుకునేందుకు సీనియర్ ఎంపీ మైత్రేయన్, శాసనసభ స్పీకర్ ధన్‌పాల్ తదితరులతోపాటు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.  ఈ సందర్భంగా పన్నీర్ సెల్వం మాట్లాడుతూ తనను ద్రోహి అన్న శశికళ వర్గంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత స్టాలిన్ ఎదురుపడితే నవ్వడం కూడా నేరమేనా? అని ప్రశ్నించారు.

శశికళకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టే ప్రయత్నాల్లో ఉన్న పన్నీర్ సెల్వం తనకు మద్దతు తెలుపుతున్న 62 మంది ఎమ్మెల్యేలతో నేడు(బుధవారం) ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మరికొన్ని గంటల్లో ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్, హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌లను కలిసి మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి వినతిపత్రం ఇవ్వనున్నట్టు సమాచారం.  మరోవైపు ప్రస్తుత అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో అధికశాతం మంది శశికళ వర్గీయులు కావడంతో పన్నీర్‌కు వారు మద్దతు ఇచ్చే అవకాశాలు దాదాపు లేనట్టే. ఈ నేపథ్యంలో ఆయన డీఎంకే వైపు ఆశగా చూస్తున్నారు.

More Telugu News