: ఇప్పటికే 'జడ్ ప్లస్'లో ఉన్న కేసీఆర్ కు అసాధారణ రీతిలో భద్రత పెంపు

ఇటీవలి కాలంలో ఖమ్మం, వరంగల్ జిల్లాల్లో మావోయిస్టుల సంచారం పెరగడం, ఆపై ఏఓబీలో జరిగిన దాడితో అప్రమత్తమైన తెలంగాణ పోలీసులు, ఇప్పటికే జడ్ ప్లస్ భద్రతా వలయంలో ఉన్న సీఎం కేసీఆర్ కు మరింత భద్రతను పెంచారు. ఇప్పటికే ఆయన కాన్వాయ్ లో ఆరు బులెట్ ప్రూఫ్ వాహనాలు సహా ఓ అంబులెన్స్ ఉండగా, మరో మూడు బులెట్ ప్రూఫ్ వాహనాలను చేర్చారు. ఇద్దరు డీఎస్పీ ర్యాంకు అధికారులు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్లుగా ఉండగా, వీరికి అదనంగా త్రీ ప్లస్ త్రీ విధానంలో ఇన్ స్పెక్టర్ స్థాయి అధికారులను పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్లుగా నియమించినట్టు భద్రతా వ్యవహారాల అధికారులు తెలిపారు.

సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద 10 గార్డు డ్యూటీ పోస్టులు కూడా కొత్తగా ఏర్పాటయ్యాయి. ఇంతవరకూ 12 మంది ఎన్ఎస్జీ సిబ్బంది సహా, ఇంటెలిజెన్స్ వింగ్ నుంచి మరో 12 మంది ఒక్కో షిఫ్ట్ లో విధులు నిర్వహిస్తుండగా, ఈ సంఖ్యను 16కు పెంచారు. ఎర్రవల్లిలోని కేసీఆర్ ఫాం హౌస్ వద్ద ఉన్న రెండు గార్డు పోస్టులను ఆరుకు పెంచి, ప్రత్యేక జామర్ ను అక్కడ ఏర్పాటు చేశారు. ఇకపై ఎర్రవెల్లి వెళ్లాలని భావిస్తే, ముందు తమకు చెప్పాలని, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్లడానికి వీల్లేదని భద్రతాధికారులు సీఎంకు సూచించినట్టు సమాచారం.

More Telugu News