: జయలలిత చికిత్సకు అయిన ఖర్చు ఎంతో వెల్లడించిన అపోలో వైద్యులు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణంపై ఎన్నో రకాల పుకార్లు చక్కర్లు కొట్టడం తనను ఎంతో బాధించిందని ఆమెకు చికిత్స చేసిన లండన్ వైద్యుడు రిచర్డ్ బేలే అన్నారు. చికిత్సకు సంబంధించి ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని... అత్యున్నత చికిత్సను అందించామని చెప్పారు. అపోలో వైద్యులతో కలసి నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆయన ఈ విధంగా తెలిపారు. ఎవరైనా చికిత్స పొందుతున్నప్పుడు ట్రీట్ మెంట్ ను సీసీ కెమెరాల్లో రికార్డు చేయడం సరికాదని రిచర్డ్ బేలే తెలిపారు. పేషెంట్ క్రిటికల్ కేర్ యూనిట్ లో ఉంటే... ఫొటోలు, వీడియోలు ఎలా తీయగలమని ప్రశ్నించారు. తమ మీద ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని తెలిపారు. తాము వైద్యులం మాత్రమేనని... విధాన రూపకర్తలం కాదని చెప్పారు. కేవలం వైద్యపరమైన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు ఇవ్వగలమని తెలిపారు.

జయ చికిత్సకు రూ. 5.5 కోట్లు ఖర్చయిందని అపోలో వైద్యులు తెలిపారు. చివరి నిమిషం వరకు ఆమె మాట్లాడుతూనే ఉన్నారని వెల్లడించారు. గవర్నర్ వచ్చినప్పుడు కూడా తాను బాగానే ఉన్నట్టు సైగలు చేశారని తెలిపారు. గుండె పోటు ఎప్పుడు వస్తుందో ముందే ఊహించలేమని చెప్పారు. జయ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటం వల్లే ఎవరినీ లోపలకు అనుమతించలేదని తెలిపారు. శశికళకు, సీఎస్ కు ఎప్పటికప్పుడు సమాచారం అందించామని చెప్పారు.

More Telugu News