: చంద్రబాబు నాయుడుకి అందితే కేసీఆర్ జుట్టును కూడా పట్టుకుంటారు: చంద్రబాబుపై జగన్ ఆగ్రహం
చంద్రబాబు నాయుడు అధికారం కోసం ఆనాడు ఎన్టీఆర్ ని వెన్నుపోటు పొడిచారని, మరోవైపు ఎన్నికల సమయంలో మాత్రం ఎన్టీఆర్ విగ్రహాలకు పూలదండలు వేస్తారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి అన్నారు. అనంతపురం జిల్లాలోని హంద్రీనీవా ద్వారా ఆయకట్టుకు సాగునీటిని కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు ఉరవకొండలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన మహాధర్నాలో ఆయన పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు రోజుకో తీరుగా మాట్లాడతారని ఆయన అన్నారు. మోదీ బలహీనంగా ఉన్నప్పుడు ఆయనతో ఢీ అంటారని, అదే మోదీ బలంగా ఉన్నప్పుడు ఆయన వద్దకు వెళ్లి స్నేహం అంటారని జగన్ అన్నారు.
చంద్రబాబుకి అందితే కేసీఆర్ జుట్టును కూడా పట్టుకుంటారని, లేదంటే కాళ్లు పట్టుకుంటారని జగన్ విమర్శించారు. ఓ పక్క ఆంధ్ర ప్రాంతంలోని నీళ్లను కేసీఆర్ లాక్కెళ్లిపోతోంటే చంద్రబాబు ఆయనను ప్రశ్నించడం లేదని ఆయన అన్నారు. మరో రెండేళ్లు పోతే ఎన్నికలు వస్తాయని, ఆ తరువాత మన ప్రభుత్వమే వస్తుందని జగన్ వ్యాఖ్యానించారు. ఆ తరువాత హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి చేసి చూపిస్తానని జగన్ అన్నారు. మంచి చేసినా చేయకపోయినా ప్రచారం చేసుకుంటే చాలు, మళ్లీ ఓట్లు పడతాయని చంద్రబాబు భావిస్తున్నారని, వీటన్నిటినీ ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీని బంగాళాఖాతంలో కలిపేస్తారని జగన్ అన్నారు. చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి ఇద్దరినీ ప్రజలు గుర్తుంచుకుంటారని, అయితే, ఏ ప్రాంతంలోనైనా నీరు కనిపిస్తే రాజశేఖర్ రెడ్డిని తలచుకుంటారని, ఎక్కడయినా మోసం జరుగుతున్నట్లు కనిపిస్తే చంద్రబాబు నాయుడిని గుర్తుచేసుకుంటారని జగన్ చమత్కరించారు.