: జాబు రావాలన్నా.. రుణాలు మాఫీ కావాలన్నా బాబు రావాలన్నారు.. మరి వచ్చాయా?: జగన్
బ్యాంకుల్లో రైతులు పెట్టిన బంగారం ఇంటికి రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలని అన్నారని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారని, మరి ఆ బంగారం ఇంటికి వచ్చిందా? అని వైసీపీ అధినేత జగన్ ప్రశ్నించారు. రైతుల రుణాలన్నీ మాఫీ అయ్యాయా? అని నిలదీశారు. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రాలేదు కానీ ... బ్యాంకుల నుంచి రైతులకి నోటీసులు మాత్రం వస్తున్నాయని ఆయన అన్నారు. చదువుకుంటున్న పిల్లల్ని కూడా బాబు వదలలేదని ఆయన అన్నారు.
‘జాబు రావాలి అంటే బాబు రావాలి అన్నారు... వచ్చాయా? జాబు ఇవ్వలేకపోతే నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు. ఇచ్చారా? చంద్రబాబు పరిపాలన వచ్చి 32 నెలలు అవుతున్నా తమకు ఉద్యోగాలు రాలేదని యువత వాపోతున్నారు. అనంతపురం జిల్లాలో చేనేత కార్మికులు ఎక్కువగా ఉన్నారు. చేనేత కార్మికుల రుణాలు మాఫీ కావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలన్నారు.. చేనేత కార్మికులకు ఇళ్లు కట్టిస్తా అన్నారు. వడ్డీలేని రుణాలు ఇప్పిస్తానన్నారు.. అధికారంలోకి వచ్చాక చేనేత కుటుంబాలకు వచ్చే సబ్సిడీని కూడా ఎత్తివేశారు’ అని జగన్ వ్యాఖ్యానించారు.