: ఇండియాలో విలీనంపై ప్రజాభిప్రాయాన్ని కోరాలని పాక్ ను డిమాండ్ చేసిన రాజ్ నాథ్ సింగ్

ఇండియాలో తిరిగి విలీనం కావడంపై పాక్ పాలకులు తమ దేశ పౌరుల అభిప్రాయాన్ని కోరుతూ రెఫరెండం నిర్వహించాలని భారత హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ డిమాండ్ చేశారు. హరిద్వార్ లో జరిగిన ఓ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించిన ఆయన, కాశ్మీర్ ఎన్నటికీ భారత్ లో భాగమేనని స్పష్టం చేశారు. "కాశ్మీర్ లో రెఫరెండం నిర్వహించాలని పాకిస్థాన్ కోరుతోంది. నేను ఒకటి స్పష్టం చేస్తున్నా. కాశ్మీర్ భారత్ లో అంతర్భాగమే. ఏ శక్తి కూడా దాన్ని విడదీయలేదు. మమ్మల్ని ప్రజాభిప్రాయం అడిగే బదులు, తమ ప్రజలు ఇండియాలో విలీనం కావాలని భావిస్తున్నారా? అన్న ప్రశ్నకు ముందు సమాధానం కనుగొనాలి. ఈ దిశగా పాక్ రెఫరెండం నిర్వహించాలి" అని అన్నారు.

రెండు దేశాల మధ్యా ద్వైపాక్షిక బంధాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న పాక్ వైఖరి గర్హనీయమని నిప్పులు చెరిగారు. పొరుగు దేశాలతో శాంతిని కోరుకోవడమే తమ ఉద్దేశమని, అయితే, అవతలి వైపు నుంచి కూడా అదే విధమైన స్పందన ఉంటేనే శాంతి సాధ్యమని స్పష్టం చేశారు. సర్జికల్ స్ట్రయిక్స్ తో, ఇండియా సైతం బలమైన సంకేతాలను పంపిందని, ఇకపై మెతకగా ఉండబోమని రాజ్ నాథ్ తెలిపారు.

More Telugu News