: ముహూర్తం ఖరారు, 9న శశికళ ప్రమాణ స్వీకారం... సిగ్గుచేటన్న చిదంబరం

తమిళనాడుకు మూడవ మహిళా ముఖ్యమంత్రిగా వీకే శశికళా నటరాజన్ ఈ నెల 9న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. శశికళ జాతకానికి తగ్గట్టుగా 9న మంచి ముహూర్తం ఉండటంతో, గురువారం ఆమె బాధ్యతలు చేపట్టనున్నారని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. తొలుత 7వ తేదీన ఆమె ప్రమాణ స్వీకారం చేయవచ్చన్న వార్తలు వచ్చినప్పటికీ, ఆమె 9వ తేదీనే ఎంచుకున్నట్టు తెలుస్తోంది.

ఇక శశికళ ముఖ్యమంత్రి పీఠం చేపట్టడాన్ని తమిళ ప్రజలు తీవ్రంగా నిరసిస్తున్నారు. ఈ ఉదయం పలు ప్రాంతాల్లో అన్నాడీఎంకే పార్టీ కార్యకర్తలు నిరసన ప్రదర్శనలకు దిగారు. ఆమెకు పీఠం అప్పగించడంపై డీఎంకే, ఎండీఎంకే, డీఎండీకే, కాంగ్రెస్ తదితర పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. శశికళ సీఎం పదవిని చేపట్టడం సిగ్గుచేటని కేంద్ర మాజీ మంత్రి పి.చిదంబరం వ్యాఖ్యానించారు. శశికళ సీఎం అయితే, తమిళనాడులో అస్థిరత పెరుగుతుందని బీజేపీ వ్యాఖ్యానించింది. రాజకీయాలు ఇంతగా దిగజారుతాయని తాను ఊహించలేదని ఆర్ఎస్ఎస్ నేత గురుమూర్తి నిప్పులు చెరిగారు. ఆమె నేరస్తురాలని, విచారణ జరిపించాలని ప్రధాని మోదీకి అన్నాడీఎంకే బహిష్కృత ఎంపీ శశికళా పుష్ప ఇప్పటికే లేఖ రాసిన సంగతి తెలిసిందే.

More Telugu News